స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఎవరెన్ని విమర్శలు చేసినా మూసీ నది ప్రక్షాళన జరిగి తీరుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కెటిఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మూసీ అభివృద్ధి నిధి కింద రూ.వేయి కోట్ల లోన్లు తీసుకున్నారన్నారు. ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారని అన్నారు.హైదరాబాద్ లోని నోవాటెల్ లో శుక్రవారం నిర్వహించిన అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. నాచారం, జీడిమెట్ల వంటి ప్రాంతాల్లోని పరిశ్రమలు మూసీలో వ్యర్థాలను వొదుతున్నాయన్నారు. మూసీ దుర్వాసన, మహమ్మారి రోగాలకు ప్రజలు బలవుతున్నారన్నారు.
సబర్మతి, నమామి గంగే ప్రాజెక్టులు చేసినట్లు మూసీని ఎందుకు ప్రక్షాళన చేయొద్దని ప్రశ్నించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.హైదరాబాద్ నగరంలో జనాభాకు అనుగుణంగా జిహెచ్ఎంసిని నాలుగు ప్రధాన కార్పొరేషన్లుగా విభజించబోతున్నామన్నారు. కెసిఆర్ కాలేశ్వరం నిర్మిస్తే అది కాస్తా కూలిపోయి రూ.2లక్షల కోట్లు గంగపాలైందన్నారు. అయితే మూసీ సుందరీకరణకు రూ. 1.50 కోట్లా? అని అదే కెసిఆర్ ప్రశ్నిస్తున్నారన్నారు. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారన్నారు. డిపిఆర్ సిద్ధం చేయకముందే కెటిఆర్ ఆరోపణలు చేయడమేంటని నిలదీశారు. ఎట్టి పరిస్థితిలో మూసీ ప్రక్షాళన చేసితీరుతామన్నారు. రూ. 30వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నామన్నారు. ఈ రోడ్డు తెలంగాణలో 50 శాతం కవర్ చేస్తుందన్నారు. రాబోయే నవంబర్ నెలలో టెండర్లను పిలుస్తామన్నారు. 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు భవనాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు.