- కరుణగిరిలో రోడ్డు ప్రమాదం.. తన కారులో హాస్పిటల్ కు క్షతగాత్రుడి తరలింపు
- తన భద్రత కంటే క్షతగాత్రుడి ప్రాణాలే ముఖ్యమని వెల్లడి..
ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : అయ్యో.. బాబూ ఏమైంది… దెబ్బలు బాగా తగిలినట్టు ఉన్నాయ్.. ఏం కాదులే నేనున్నా.. ముందు అతడినికారు ఎక్కించండి…. త్వరగా కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లండి…. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఆ కారుకు పోలీస్ ఎస్కార్ట్ ను పంపండని మంత్రి పొంగులేటి అన్నారు. ఇది గమనించిన స్థానికులు మానవత్వానికి మారుపేరు పొంగులేటి శీనన్న అంటూ ప్రశంసలు కురిపించారు. వివరాల్లోకి వెళ్లితే…. తిరుమలాయపాలెం మండల పర్యటనను ముగించుకుని మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఖమ్మంలోని తన క్యాంపు ఆఫీస్ కు మంత్రి పొంగులేటి బయలుదేరారు. అదే సమయంలో కరుణగిరి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దీనిని గమనించిన మంత్రి తన కాన్వాయ్ ను వెంటనే ఆపి క్షతగాత్రుడి దగ్గరకు వెళ్లి రామర్శించారు. వెంటనే రక్తపు మరకలతో ఉన్న అతడిని కిమ్స్ హాస్పిటల్ తరలించాలని ట్రాఫిక్ సీఐ సాంబశివరావును ఆదేశించడమే కాకుండా.. తన కోసం వచ్చిన ఎస్కార్ట్ వాహానాన్ని ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా బాధితుడి వెంట పంపమని సూచించారు. వెంటనే సీఐ తన సిబ్బంది ద్వారా బాధితుడిని హాస్పిటల్ కు తరలించారు. కాగా ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.