దిల్లీ కాలుష్యంపై ‘సుప్రీమ్‌’ ‌సీరియస్‌

కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్న
పంజాబ్‌, ‌హర్యానా ప్రభుత్వాల తీరుపైనా అసంతృప్తి

న్యూదిల్లీ, అక్టోబర్‌ 23(ఆర్‌ఎన్‌ఐ) : ‌దిల్లీ కాలుష్యంపై కేంద్రంతో పాటు పంజాబ్‌, ‌హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది.  పొరుగు రాష్ట్రాల్లో చెత్తను తగులబెడుతుండడంతో దిల్లీలో ఏర్పడే కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సవరణలతో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని కోరల్లేని దానిగా మార్చారంటూ ఘాటుగా స్పందించింది. కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం శిక్షాస్పదమైన చర్యలు చేపట్టడం లేదని.. కేవలం నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్‌ ‌జనరల్‌ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. పది రోజుల్లో నిబంధనలు ఖరారు చేస్తామన్నారు. చట్టం పూర్తిగా అమలులోకి తీసుకువస్తామని జస్టిస్‌ అభయ్‌ ‌శ్రీనివాస్‌ ఓకా ధర్మాసనానికి హామీ ఇచ్చారు. వాయు కాలుష్యం అరికట్టేందుకు చట్టాన్ని అమలు చేసేందుకు అవసరమైన యంత్రాంగం లేకుండానే ఎయిర్‌ ‌క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ ‌చట్టాన్ని రూపొందించారని ధర్మాసనం పేర్కొంది.

పరిశుభ్రమైన, కాలుష్య రహిత వాతావరణంలో జీవించడం పౌరుల ప్రాథమిక హక్కు అని ధర్మాసనం స్పష్టం చేసింది. పౌరుల హక్కులను కాపాడడం కేంద్ర, రాష్ట్రాల కర్తవ్యమని చెప్పింది. ఆర్టికల్‌ 21 ‌ప్రకారం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాను పెంచేందుకు చట్టాన్ని సవరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే, పంజాబ్‌, ‌హర్యానా రెండు రాష్ట్రాల కార్యదర్శి (పర్యావరణ), అదనపు ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం)కి షోకాజ్‌ ‌నోటీసులు అందించామని ఏఎస్‌జీ తెలిపారు.కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సిద్ధంగా ఉంటే సెక్షన్‌ 15 ‌సవరణకు ముందు ప్రతిదీ జరిగి ఉండేదని.. ఇదంతా రాజకీయం.. మరేమీ కాదని కోర్టు పేర్కొంది.

మరో వైపు పంజాబ్‌, ‌హర్యానా ప్రభుత్వాలపై సైతం సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం చేసింది. చెత్తను దహనం చేసిన వారిపై రెండు రాష్ట్రాలు ఎలాంటి శిక్షార్హమైన చర్యలు తీసుకోలేదని పేర్కొంది. చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్రాలకు ఆసక్తి ఉంటే కనీసం ప్రాసిక్యూషన్‌ అయినా ఖచ్చితంగా జరుగుతుందని కోర్టు పేర్కొంది. సుమారు 1,080 ఎఫ్‌ఐఆర్‌లు, 473 మంది నామమాత్రపు జరిమానాలే విధించారని పంజాబ్‌ ‌సెక్రెటరీపై సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఏం చేయబోమంటూ సిగ్నల్‌ ఇస్తున్నారా? అంటూ ప్రశ్నించింది. గత మూడేళ్లుగా ఇదే జరుగుతోందని మండిపడింది.

400 వ్యవర్థాలు దహన ఘటనలు జరిగాయని హర్యానా ప్రధాన కార్యదర్శి సుప్రీంకోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో 32 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని చెప్పగా.. సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేస్తూ.. లెక్కలపై అబద్ధాలు చెబుతున్నారని కోర్టు పేర్కొంది. కొందరికి జరిమానాలు విధించి.. మరికొందరిపై ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పింది. ఇక వాయు కాలుష్యం కేసును దీపావళి తర్వాత విచారించనున్నట్లు తెలిపింది. ఢిల్లీలో వాహనాలతో కాలుష్యం, నగరంలోకి భారీ ట్రక్కుల ప్రవేశం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త దహనం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page