హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్24: భవిష్యత్తులో తెలంగాణలోనే సొంతంగా సీడ్ గార్డెన్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మలేసియా పర్యటనలో ఉన్న మంత్రి.. రెండో రోజు పలు సంస్థలను సందర్శించారు. ప్రపంచంలో అతి పెద్ద వ్యాపార ఆధారిత క్రూడ్ ఫామాయిల్ ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఎఫ్జీవీ కంపెనీ సీడ్ గార్డెన్ ను సందర్శించారు. నర్సరీలను, అధునాతన సాంకేతిక పద్ధతులతో ఉన్న విత్తన కేంద్రాన్ని పరిశీలించారు.
అనంతరం ఆ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సొంతంగా సీడ్ గార్డెన్ ఏర్పాటుకు ఎఫ్జీవీ కంపెనీ సహకరించాలని కోరారు. అందుకు రాష్ట్ర భాగస్వామ్యంతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అనంతరం ఎఫ్జీవీ కంపెనీ కర్మాగారాన్ని సందర్శించి అక్కడ తయారు చేసే వివిధ ఉత్పత్తులను మంత్రి పరిశీలించారు. కంపెనీ తీసుకునే జాగ్రత్తలు, వివిధ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ గురించి మంత్రి తుమ్మలతో పాటు అధ్యయన బృందానికి ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు.