- హైడ్రా కూల్చివేతల్లో అంతా హిందూ బాధితులే
- కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28: చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన హైడ్రా జెట్ స్పీడ్తో కూల్చివేతలు చేపట్టింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పేదలకు చెందిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది మరోవైపు హైడ్రాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హైడ్రా కూల్చివేతలపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రా తీరుపై కేంద్ర మంత్రి స్వయంగా పాట పాడి వినిపించారు.
‘పారాణి ఇంకా ఆరలేదు. తోరణాల కల వాడనెలేదు అంటూ పాట పాడి సెటైర్లు విసిరారు. ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతలన్నీ హిందువులవే అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ముస్లింలకు సంబంధించిన ఏ ఒక్క బిల్డింగ్ కూల్చలేదన్నారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ కొరివితో తల గోక్కుంటోందని అన్నారు. హైడ్రాకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కానీ హైడ్రా నిర్ణయం వల్ల పేదలు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. రేపు మూసీ వల్ల పేద ప్రజలకు తీరని అన్యాయం జరగనుందన్నారు. మూసీ పేరిట లేని ఇబ్బందులు తెస్తున్నారని తెలిపారు.
గతంలో ఒకాయన ఇలా అని ఫామ్ హౌస్ లో పడుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. జీతాలు ఇవ్వడానికి, రుణమాఫీ, ఆరు గ్యారెంటీలకు డబ్బులు లేవని.. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా డౌన్ అవుతుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లకు ఒకటే గతి పడుతుందని హెచ్చరించారు. తెలంగాణ మరో శ్రీలంక కాబోతోందంటూ కేంద్రమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన నిధులపై లోకల్ బాడి ఎన్నికలకు రావాలి అంటూ రెండు పార్టీలకు బండి ఛాలెంజ్ విసిరారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అలాగే హిందువులపై జగన్ మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి నైతికంగా ఫెయిల్ అయ్యారన్నారు. మక్కా , వాటికన్ సిటీలకు వెళితే కొన్ని నిబంధనలు ఉంటాయని.. దానిమీద మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. హిందువులపై మాట్లాడి జగన్మోహన్ రెడ్డి మరింత అపవాదు మూటగట్టు కున్నారని బండి సంజయ్ అన్నారు.