కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా.. దేశవ్యాప్తంగా దసరా పండుగను వైభవోపేతంగా నిర్వహించుకోవడం మన సంప్రదాయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దసరా పండగ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపడంతోపాటుగా మనకు బాధ్యతలను కూడా గుర్తుచేస్తుందని, సత్యం, సదాచార మార్గంలో కర్తవ్యనిష్టతో ముందుకెళ్లడం ద్వారా ఎంతటి కష్టాన్నయినా ఎదుర్కొని విజయం సాధిస్తామనేది విజయదశమి మనకందించే సందేశమని వివరించారు. రామాయణ మూలసూత్రాలను, అందులో దాగున్న విలువలను సమాజానికి బోధించే దసరా పండగ.. ప్రపంచం, సమాజం, కుటుంబం వంటి విషయాలపై మన కర్తవ్యాన్ని, మనుషుల మధ్య పరస్పర సంబంధాలు, మర్యాదలను గుర్తుచేస్తుందన్నారు.
దసరా పండగ ప్రపంచానికి స్రీ శక్తిని చాటుతుందని, మహిళలు దుర్గాదేవి అవతారం, వారిని గౌరవించుకోవడంతోపాటు సమాజంలో వారికి సమాన అవకాశాలు ఇవ్వాల్సిన స్ఫూర్తిని చాటే దసరా పండగ అంటూ కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరి కీశుభాకాంక్షలు తెలియజేశారు. విజయదశమి పండగ అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.