రాజ్యాధికారం ద్వారానే మార్పు సాధ్యం!

 బీసీల ఐక్యతే  భవిష్యత్తుకు పునాది
బీసీలకు రాజ్యాధికారం, చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లు, మా వాటా మాకే, బీసీల కులగణన వంటి పతాక శీర్షికలతో మనదేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీలు, మేధావులు, మీడియా సంస్థలు, విద్యావేత్తలు, ఉన్నత విద్యావంతులు, బీసీ సంఘాల నాయకులు, ప్రభుత్వ మరియు ప్రయివేటు రంగ ఉద్యోగులు, కవులు, రచయితలు తదితరులు చేస్తున్న భావ ప్రకటనలు, సామాన్య ప్రజల మధ్య చర్చలు ఎనిమిది దశాబ్దాలకు చేరువలో వున్న స్వాతంత్య్ర భారతాన్ని నేడు తీవ్రంగా ప్రభావితం చేస్తుందనడం నిర్వివాదాంశం. ప్రపంచానికి భారతదేశం ఓ ఆశాకిరణం అంటూ మన ప్రధాని నరేంద్ర మోదీ ,బీసీ డిక్లరేషన్‌ అంశాలతో  ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వంటి దేశ నాయకులు సైతం నేటి భవిష్యత్తు భారతంలో బీసీ సమాజం పాత్ర కీలకమని విశ్వసిస్తున్నారు. దాదాపు దేశ జనాభాలో 50 శాతం పైగా వున్న బీసీలు కొన్ని దశాబ్దాలుగా కొంతమంది నాయకుల స్వార్థపూరిత వోటు బ్యాంకు  రాజకీయాలతో విద్యా, రాజకీయ, సామాజిక,  ఆర్థిక రంగాల్లో వెనుకబడి వున్నారని,  ప్రజాస్వామ్య మరియు లౌకిక భారతంలో సమాన అవకాశాలు పొందలేకపోయారని గణాంకాలతో సహా కొంతమంది మేధావులు,  ప్రజాప్రతినిధులు విశ్లేషిస్తున్నారు. చట్ట సభల్లో, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అవసరమని, మా హక్కుల కోసం మా పోరాటం అంటూ బీసీల పోరుబాట ప్రారంభమైంది. స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న రిజర్వేషన్లు 23 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని డిమాండ్‌ వినిపిస్తోంది. ఏది ఏమైనా భారత్‌ లాంటి దేశంలో ప్రజల జీవితాల్లో మార్పు కేవలం రాజ్యాధికారం ద్వారానే సాధ్యపడుతుందని, కొన్ని దశాబ్దాలుగా రాజ్యాధికారం కొంతమంది చేతుల్లోనే వుందని, ఆ తీరు మారి ప్రజల తీర్పుల్లో మార్పు రావాలనే ఆలోచనలు బలంగా వ్యాపిస్తున్నాయి. శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులుగా బీసీలు ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, దేశప్రధానమంత్రులుగా వున్నప్పుడే ఆశించిన మార్పు బీసీల జీవితాల్లో కనిపిస్తుందని, అందరికీ సమాన అవకాశాలు ఇస్తూనే, ప్రతిభ ఆధారంగా ప్రోత్సాహం అందిస్తే మన దేశం ప్రపంచానికి దిక్సూచిగా మారుతుందని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 1970లో అనంత రామన్‌ కమిషన్‌ నివేదిక,1982 లో మురళీధర రావు ఏకసభ్య కమిషన్‌, తెలంగాణ ఆవిర్భావం తర్వాత బి.యస్‌ రాములు నేతృత్వంలోని తొలి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ వంటివి ఎన్నో విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలు చాలా వెనుకబడి వున్నారని వివరించాయి. నేడు దేశవ్యాప్తంగా గ్రామీణ స్థాయి నుంచే బీసీల రాజకీయ చైతన్యం కొత్త మలుపులు తిరుగుతోంది. ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో,  అసెంబ్లీ – లోక్‌ సభల్లో బీసీల గొంతుకలు వినిపించడం లేదు. మనమంతా కలిసి దేశంలో సగం భాగమై వున్నా కూడా ‘‘మన పాలన’’ ఏమయ్యిందంటూ కారణాలు వెతుక్కుంటున్నారు బీసీలు. ఇన్నాళ్ళు కేవలం పనివాళ్ళు గానే వుంటూ పాలించే వారిగా ఎదగలేకపోయామని, కనీసం మన పిల్లల భవిష్యత్తులను మార్చుకుందామని అనుకుంటున్నారు.  ఒకసారి కొన్ని దశాబ్దాల పరిణామ క్రమం గమనిస్తే కొంత మంది బీసీ నాయకులే తమ స్వార్థపూరిత రాజకీయ పదవులకోసం కొంతమంది అగ్రకులాల రాజకీయ నాయకుల వద్ద బీసీ జెండా వాడుకున్నారని, కుల సంఘాలను త్యాగం చేశారని తెలుస్తుంది. బీసీ కుల సంఘాల్లో కూడా కొన్ని కులాలకు చెందిన కొంతమంది నాయకుల ఆధిపత్యధోరణే నేటి బీసీల అనైక్యత, వర్గపోరుకు కారణమని మేధావులు , విద్యావేత్తలు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ స్థాయి అధికారులు వంటివారు సైతం అభిప్రాయపడుతున్నారు. అడుక్కోవడం మానేసి అడగడం నేర్చుకోవాలంటున్నారు. కనీసం ఇప్పటి నుంచైనా ఎన్ని జెండాలు మన మధ్య వున్నా  ‘‘బీసీల ఎజెండానే బీసీల రాజ్యాధికారం’’ కావాలని తమ సందేశాలను వినిపిస్తున్నారు. బీసీల సంఘటితమే నేడు చారిత్రాత్మక అవసరమని,బీసీల ఐక్యత వోటు రూపమై బ్యాలెట్‌ బాక్సులో నిక్షిప్తం కావాలని బీసీల అభ్యున్నతికై పాటుపడే వ్యక్తులను నాయకులుగా మార్చాలని ఆశిస్తున్నారు.  దేశవ్యాప్తంగా కొన్ని సందర్భాల్లో కొన్ని రాజకీయ వేదికల ద్వారా ‘‘మేము మాత్రమే పాలించగలం’’అంటున్న కొంతమంది అగ్రకులాల నాయకులకు ‘‘బహుజనులం.. మేమేం  తక్కువకాదని చూపాల్సిన సందర్భం ఆసన్నమైంది.
ఒక దగ్గర ‘‘ఆకలితో వున్న నలుగురు వ్యక్తులకు పదిమందికి సరిపడా భోజనం ఇచ్చి, ఇంకో దగ్గర ఆకలితో వున్న ఇంకో 52 మందికి 25 మందికి సరిపడే భోజనం ఇచ్చి ఆకలి తీర్చుకోమంటే ఎలా? అని ప్రశ్నించే కలాలు, గళాలు కావాలిప్పుడు  నేటీ బీసీల జీవితాల్లో మార్పుకోసం..! ఆకలి బాధ అందరికీ ఒక్కటే అయినప్పుడు న్యాయం జరగాలి.  ప్రస్తుత తరుణంలో బీసీల కులసంఘాల నాయకులు వారి రాజకీయపార్టీలకతీతంగా ఏకాభిప్రాయానికి రావాలి.  దీనికై బీసీల మేధావుల ఫోరాలు, బీసీల ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు తదితర బీసీ ప్రముఖులు ముందుకు రావాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వున్న బీసీ పెద్దలు  బీసీల అభ్యున్నతికై తోడ్పాటు అందించాలి. బీసీ యువత వీరి వెంట వుంటూ చర్చలు , సమావేశాల్లో వీరికి మద్దతివ్వాలి’’ఈ ప్రపంచాన్ని మార్చగల ఒకే ఒక ఆయుధం చదువు’’మాత్రమే అన్న నెల్సన్‌ మండేలా స్ఫూర్తితో బీసీ కులాల పిల్లలకు జనాభా ప్రాతిపదికన సమాన విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్చలు జరిపి భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.కుల,మత,ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టకుండా జాతి సమైక్యత కాపాడుతూ మహాత్మా గాంధీజీ స్ఫూర్తితో అహింసా మార్గంలో శాంతియుత ఉద్యమాలు నడపుతూ బీసీల హక్కుల కై అలుపెరగని పోరాటాలు జరగాలి. అంతర్జాతీయ స్థాయి ప్రతిభను ప్రోత్సాహిస్తూనే శాస్త్రీయంగా, న్యాయబద్ధంగా బీసీలు ఏకమై వోటు రూపంలో ఒక్కటై ‘‘మేమెంతో మాకంత’’అంటూ అంబేడ్కర్‌ రాజ్యాంగ స్ఫూర్తితో మనదేశ భవిష్యత్తును మార్చాలి. అందరికీ తెలిసిందే..! వడ్డించే వాడు మనవాడైతే మనం ఎక్కడున్నా ‘‘అన్నీ’’ అందుతాయి. ఇప్పుడు మనకు వడ్డించేవాడు మనవాడై, మన పాలకుడైతే మన ప్రజాస్వామ్య ఫలాలు మనకు అందుతాయి.
గంటలు గంటలు చర్చలు, రాజకీయ నాయకులపై విమర్శలు మాని, గతాన్ని వదిలేసే మౌనంగా బీసీలు ఐక్యమయ్యే పనులు చేస్తూ పోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు బీసీల వాణి వోటురూపమై ప్రతిధ్వనిస్తే బీసీల ప్రాతినిధ్యం అన్నిరంగాల్లో త్వరలోనే ఈ దేశం చూస్తుంది. ప్రస్తుతం యస్‌.సి, యస్‌.టి వారి రాజకీయ, సామాజిక చైతన్యం మరియు సంఘటితం వంటి అంశాలను బీసీలు ఆదర్శంగా తీసుకొని జనాభా ప్రాతిపదికన అన్నిరంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కోసం అడుగులు వేయాల్సిందే. ప్రస్తుత పరిస్థితిలో బీసీలంటే కేవలం కొన్ని కులాల సమూహాలు కావు..! కొన్ని దశాబ్దాలుగా రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో సమాన అవకాశాలు పొందలేకపోయి వివక్షతకు గురైన స్వాతంత్య్ర భారతంలోని ఓ మెజారిటీ ప్రజల వర్గం. బీసీల పోరాటమంటే కొన్ని అగ్రకులాల అవకాశాలకు వ్యతిరేకం కాదు. కనీసం తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు కావాలని న్యాయబద్ధంగా కదిలిన కొన్ని కోట్ల మంది తల్లిదండ్రుల అంతరంగపు ప్రయత్నం.

-ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌
 సెల్‌ : 9394749536

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page