పదేళ్ల నియంతృత్వ సంకెళ్లు తెంచాం

  • తెలంగాణ ప్ర‌స్థానంలో సెప్టెంబ‌ర్ 17 అత్యంత కీల‌క‌మైన రోజు..
  • బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం
  • తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల పిడికిలి…. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి.
  • ప్రజాపాలన దినోత్సవ వేడుక‌ల్లో సీఎం రేవంత్ రెడ్డి
  • అమరుల స్థూపం వద్ద నివాళి..
  • పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో జెండా ఆవిష్కరణ

హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర, సెప్టెంబ‌ర్ 17 :  తెలంగాణ ప్ర‌స్థానంలో సెప్టెంబ‌ర్ 17 అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కమైన రోజ‌ని,  తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం.. 1948 సెప్టెంబర్‌ 17న ఇదే హైదరాబాద్‌ గడ్డపై ఆవిష్కృతమైందని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అంటే త్యాగం.. ఆ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమురయ్య అని. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణత్యాగాలు చేశారని ఆ నాటి సాయుధ పోరాటంలో అమరులైన వీరులకు ఘన నివాళి అర్పిస్తున్న‌ట్లు తెలిపారు.  మంగళవారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో జరిగిన ప్రజా పాలన దినోత్సవ వేడుక‌ల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు అని  ఈ శుభదినాన్ని ఎలా నిర్వచించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కొందరు విలీన దినోత్సవమని, కొందరు విమోచన దినోత్సవమని సంబోధిస్తున్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. అందుకే… ఈ శుభదినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ… ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా నామకరణం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష… వారి ఆలోచన. ఇది నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి. మనం జాగ్రత్తగా గమనిస్తే… తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికిలి మాదిరిగా ఉంటుంది. పిడికిలి పోరాటానికి చిహ్నం.. తెలంగాణలో అన్ని జాతులు, అన్ని కులాలు, మతాలు కలిసికట్టుగా  ఉంటాయన్న సందేశం ఇందులో ఇమిడి ఉంది. ఈ ఐక్యతను, ఈ సమైక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్‌ 17ను కొందరు వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయడం క్షమించరాని విషయమ‌ని రేవంత్ రెడ్డి అన్నారు. .

బిగించిన పిడికిలి కొండలనైనా పిండి చేయగలదని,  ఐక్యంగా, సమైక్యంగా  ఉండే తెలంగాణకు బిగించిన పిడికిలికి ఉన్నంత శక్తి ఉంద‌ని, ఇది నాలుగు కోట్ల ప్రజల పిడికిలి…. ఇది ఎప్పటికీ అలాగే ఉండాలి. పెత్తందార్లపై, నియంతలపై ఈ పిడికిలి ఎప్పటికీ పోరాట సంకేతంగా ఉండాలి. గడచిన పదేళ్లలో తెలంగాణ నియంత పాలనలో మగ్గిపోయింది. ఆ బానిస సంకెళ్లను తెంచడానికి మాకు స్ఫూర్తి సెప్టెంబర్‌ 17. నేను పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు మాట ఇచ్చాను. తెలంగాణను నియంత పాలన నుండి విముక్తి చేస్తానని చెప్పాను. గజ్వేల్‌ గడ్డ మీద 2021 సెప్టెంబర్‌ 17 నాడు ‘‘దళిత – గిరిజన ఆత్మగౌరవ దండోరా’’ మోగించినం. 2023 డిసెంబర్‌ 3 నాడు తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించడంలో మాకు స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమే. మా ఆలోచన, మా ఆచరణ ప్రతీది ప్రజా కోణమే. అందుకే ఈ శుభ దినాన్ని ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా అధికారికంగా నిర్వహిస్తున్నాం. ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలి. బాధ్యతగా ఉండాలి… ప్రతి నిర్ణయంలో ప్రజల కోణం ఉండాలి. అమరుల ఆశయాలు ఉండాలి… యువత ఆకాంక్షలు ఉండాలి. మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం.

‘పదేళ్లలో విధ్వంసమైన తెలంగాణను సాంస్కృతికంగా, ఆర్థికంగా పునరుజ్జీవం చేయాల్సిన అవసరాన్ని మేం గుర్తించాం. తెలంగాణ సంస్కృతి అంటే మా ఇంటి సంస్కృతి, తెలంగాణ అస్థిత్వం అంటే మా కుటుంబ అస్థిత్వం అని గత పాలకులు భావించారు. తెలంగాణ జాతి తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉందని భ్రమించారు. మన సంస్కృతిని, మన స్వాభావిక లక్షణాన్ని అర్థం చేసుకునే ఉద్ధేశం వారికి లేదు. నిజాంనే మట్టికరిపించిన చరిత్ర తెలంగాణకు ఉన్నదన్న విషయం విస్మరించారు. మీ బిడ్డగా తెలంగాణ గుండె చప్పుడు తెలిసిన వాడిగా… అధికారంలోకి రాగానే సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాను. అందెశ్రీ రచించిన ‘‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’’ గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించాం. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి శ్రీకారం చుట్టినం. తెలంగాణ రాష్ట్ర సంక్షిప్త నామం TS ను TG గా మార్చాం. ఇది కేవలం అక్షరాల మార్పు కాదు… ప్రజల ఆకాంక్షల తీర్పు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఇటీవలే తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేసుకున్నాం. డిసెంబర్‌ 9 నాడు మన తల్లి విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. తెలంగాణ సాంస్కృతిక సారథి గద్దర్‌ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నాం.’ ఇలా… ప్రతి ఆలోచనలో తెలంగాణ సాంస్కృతిక పూర్వ వైభవం దిశగా సాగుతున్నామని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు..

తెలంగాణ‌ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ‘‘ఫ్యూచర్‌ స్టేట్‌’’ గా బ్రాండ్‌ చేస్తున్నామ‌ని, పెట్టుబడులను ఆక‌ర్షించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల బేగరి కంచె వద్ద ఫోర్త్‌ సిటీకి శంకుస్థాపన చేసుకున్నామ‌ని, మూసీ సుందరీకరణ హైదరాబాద్‌ రూపు రేఖలను మార్చివేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు… వేలమంది చిరు, మధ్య తరగతి వ్యాపారులకు ఒక ఎకనామిక్‌ హబ్‌గా తీర్చి దిద్దబోతున్నామ‌ని చెప్పారు. తెలంగాణ ప్ర‌జాపాల‌న దినోత్స‌వం సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో యువ వికాసం కోసం ప్రజా ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతోంద‌ని, ఒకవైపు గడచిన పదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన మత్తును వదిలిస్తున్నాం.

మాదక ద్రవ్యాల నియంత్రణ, నిర్మూలన విషయంలో కఠినంగా ఉంటున్నామ‌ని, టీ – న్యాబ్‌ ను బలోపేతం చేశామ‌న్నారు. మరోవైపు క్రీడలను ప్రోత్సహిస్తున్నామ‌ని, పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన తెలంగాణ బిడ్డలను ఘనంగా గౌరవించుకున్నామ‌ని తెలిపారు. ఇటీవలే ఇంటర్‌ కాంటినెంటల్‌ ఫుట్‌బాల్‌ పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించుకున్నాం. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుతో యువతలో నైపుణ్యాలకు పదును పెడుతున్నాం… ఉపాధి, ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వబోతున్నాం. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక కీలక మలుపు కాబోతోంది.

ప‌దేళ్ల పాల‌కుల పాపాల ఫ‌లితంగానే వ‌ర‌ద‌లు..
తెలంగాణ ఫ్యూచర్‌ స్టేట్‌గా మాత్రమే కాదు… క్లీన్‌ స్టేట్‌గా కూడా ఉండాలి. నేను గతంలో చెప్పినట్టు ఆర్థిక, సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు…. పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాలి. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. ఒకప్పుడు లేక్‌ సిటీగా పేరు పొందిన హైదరాబాద్‌.. ఫ్లడ్స్‌ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత పదేళ్ళ పాలకుల పాపమే.. వాటి ప్రక్షాళన కోసమే హైడ్రా (Hydra) ఏర్పాటు చేశాం. చెరువులు, నాలాలు కాపాడుకోకపోతే భవిష్యత్‌ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూశాం. ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రాకూడదు. హైడ్రా వెనుక రాజకీయ కోణం, స్వార్థం లేదు. అదొక పవిత్ర కార్యం…. ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం….దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. కొందరు భూ మాఫియాగాళ్లు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్‌ భవిష్యత్‌కు హైడ్రా గ్యారెంటీ ఇస్తుంది.

మన ఆడబిడ్డలు 87 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణం ద్వారా లబ్ధిని పొందారు. దీనివల్ల వాళ్లకు 2,958 కోట్లు ఆదా అయ్యాయి. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల నుంచి రూ. 10లక్షలకు పెంచాం. ఆడబిడ్డలకు రూ.500 కే వంట గ్యాస్‌ ఇచ్చి 43 లక్షల కుటుంబాలకు మేలు చేశాం. దీని కోసం ఇప్పటి వరకు 282 కోట్ల రూపాయల సబ్సిడీ మొత్తం చెల్లించాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ వినియోగం ఉన్న ఇళ్లకు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. ఈ పథకంలో 49 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. దీని కోసం ఇప్పటి వరకు 965 కోట్ల రూపాయల మేర సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఈ ఏడాది 4,50,000 ఇళ్లు నిర్మించబోతున్నాం. ప్రతి ఇంటి నిర్మాణానికి ఈ పథకం ద్వారా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నాం. స్థలం లేని వారికి స్థలం కూడా ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నాం. నేతన్నల కోసం ఇటీవల ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ ప్రారంభించుకున్నాం. దీనికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టుకున్నాం.

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు తెలంగాణ విద్యా కమిషన్‌ను ఇటీవలే ఏర్పాటు చేశాం. యువతకు శిక్షణతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటికి పునాది రాయి వేశాం. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి యువతకు భవిష్యత్‌ పై ఆశలు చిగురింపజేశాం. గ్రూప్‌ 1 ప్రాథమిక పరీక్షలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశాం. 11,062 పోస్టులతో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నిర్వహించాం. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నాం. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ఇందిరా మహిళాశక్తి పథకం ప్రారంభించాం. వచ్చే ఐదేళ్లలో 63 లక్షల మంది ఆడబిడ్డలకు లక్ష కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని సంకల్పించాం.

మరణించిన గల్ఫ్‌ కార్మికుల కుటుంబానికి 5 లక్షలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. గల్ఫ్‌ కార్మికుల పిల్లలకు ప్రభుత్వ గురుకులాల్లో ఉచిత విద్యను అందివ్వబోతున్నాం. గల్ఫ్‌ కార్మికులు, ఇతర దేశాల్లో పనిచేస్తున్న మనవారి సమస్యలు వినడానికి… సత్వర పరిష్కారానికి ప్రజాభవన్‌లో ‘‘ప్రవాసీ ప్రజావాణి కేంద్రం’’ ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు గల్ఫ్‌ కార్మికుల సమస్యల అధ్యయనానికి, వాటి పరిష్కారాల కోసం ఒక కమిటీని వేసి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తాం. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నాలుగు కోట్ల ప్రజల సంక్షేమమే గీటురాయిగా పాలన ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. సెప్టెంబర్‌ 17 ఇకపై ప్రజా పాలన దినోత్సవం. తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులని, . వారి ఆలోచనలే మా ఆచరణ‌ అని . వారి ఆకాంక్షలే… మా కార్యాచరణ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

గత పదేళ్లలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది..  

గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చింపిన విస్తరిలా తయారయింద‌ని, 7 లక్షల కోట్ల అప్పు… ప్రతి నెలా 6 వేల 500 కోట్ల మేర అసలు, వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో తాము బాధ్యతలు స్వీకరించామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన ప్ర‌జాపాల‌న దినోత్స‌వంలో ఆయ‌న బిఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేయడం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ఒక సవాల్‌గా స్వీకరించామ‌ని తెలిపారు. అప్పుల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామ‌న్నారు. ఆదాయ లీకేజీలు అరికట్టామ‌ని, కేంద్రం నుంచి మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి యత్నాలు చేస్తున్నామ‌ని తెలిపారు.

ఈ విషయంలో భేషజాలకు పోకుండా తానే స్వయంగా పలుసార్లు దిల్లీ వెళ్లా.. ప్రధాన మంత్రితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి, వినతి పత్రాలు ఇస్తున్నాం. నా దిల్లీ పర్యటనల మీద కొందరు విమర్శలు చేస్తున్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫాంహౌస్ సీఎంను కాదు… పని చేసే ముఖ్యమంత్రిని. నా స్వార్థం కోసమో, వ్యక్తిగత పనుల కోసమో నేను దిల్లీకి వెళ్లడం లేదు. దిల్లీ ఏ పాకిస్తాన్‌ లోనో, బంగ్లాదేశ్‌ లోనో లేదు… అది మన దేశ రాజధాని. ఇది ఫెడరల్‌ వ్యవస్థ. రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య అనేక అంశాలుంటాయి. రాష్ట్రం నుంచి మనం పన్నుల రూపంలో కొన్ని వేల కోట్లు కడుతున్నాం. అందులో మన వాటా తిరిగి తెచ్చుకోవడం మన హక్కు. ఆ హక్కుల సాధన కోసం ఎన్ని సార్లు అయినా దిల్లీకి వెళతాన‌ని స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page