ఎంపీ ఈటల రాజేందర్
మూసీ ప్రక్షాళన పేరుతో హైడ్రా తీసుకొచ్చి పేదల కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారని మల్కాజ్గిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. ధర్నా చౌక్, ఇందిరా పార్క్ వద్ద మూసీ బాధితులకు అండగా చేపట్టిన బిజెపి మహాధర్నాలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని ప్రసంగించారు. స్వయంగా కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి, లక్షల మంది కుటుంబాలకు అన్యాయం చేయొద్దని కోరారు. మూసీ బాధితులకు అండగా మేం బస్తీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మూసీ బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నరు. 70-80 ఏండ్ల క్రితం నుంచి వేలాది కుటుంబాలు తెలంగాణ పల్లెల నుంచి ఉపాధి కోసం కుటుంబాలతో కలిసి హైదరాబాద్ కు వొచ్చారని, గుడిసెలు వేసుకుని బతుకుతున్న వారికి 40 ఏండ్ల క్రితమే ప్రభుత్వం ఇండ్ల పట్టాలిచ్చిందన్నారు.
అయితే, మూసీ పరీవాహక ప్రాంతంలో బఫర్ జోన్ లో కట్టుకున్న ఇండ్లంటూ రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. తమ ఇండ్లలో సామాన్లు తీసుకునేందుకు కూడా గంటపాటు కూడా సమయం ఇవ్వకుండా ఇండ్లు కూలగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మూసీ ప్రక్షాళనకు .. ఇండ్ల కూల్చివేతలకు ఏం సంబంధం..? రేవంత్ చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే.. కాని, పేదల ఇండ్లు కూల్చడం సరికాదన్నారు. పట్టాభూముల్లో లేని ఇండ్లను పేదలు తామే కూలగొట్టుకుంటామంటున్నారు. మరి, ఒకవేళ పట్టాభూములు కాదని నిరూపించకపోతే రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాయాలని డిమాండ్ చేశారు.
మహాధర్నా కు పెద్దఎత్తున తరలివచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెంప చెల్లుమనిపించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. వాజీపేయి నగర్, దీనదయాళ్ నగర్ లాంటి అనేక నగర్ లను బీజేపీ అభివృద్ధి చేసిందని, 90 శాతం ప్రజలు పట్టా భూముల్లోనే స్థలం కొనుక్కొని ఇళ్లు కట్టుకున్నారని తెలిపారు. ఎఫ్టీఎల్ బఫర్ పేరుతో బాగా డిమాండ్ ఉన్న ఏరియాలో ఎక్కువ వెడల్పు మార్కింగ్ చేస్తున్నారు. చెరువుల్లోకి మురుగు నీరు రాకుండా చేయాలని అన్ని ప్రాంతాల వారు కోరుతున్నారు. మూసీ, హైడ్రా బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది అని ఈ వేదిక మీద నుండి భరోసా కల్పిద్దాం అని ఈటల రాజేందర్ అన్నారు.