కాంగ్రెస్ ఎంపీల ఫోరం ఛైర్మన్ మల్లు రవి విమర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 19 : రైతు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి హరీశ్రావు ఇప్పుడు.. మాట మారుస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం ఛైర్మన్ మల్లు రవి, ఎంపీలు బలరాం నాయక్, రఘురాంరెడ్డిలు ఆరోపించారు. రాజీనామా చేయకుండా తప్పించుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మాట ఇచ్చింది అంటే.. చేసి తీరుతామని నిన్నటి ఘటనతో ప్రతిపక్షాలకు తెలిసొచ్చిందన్నారు.
ఏక కాలంలో రూ.31వేల కోట్ల రుణ మాఫీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఇక గుజరాత్ మోడల్ లేదని, అంతా తెలంగాణ మోడల్ను అనుసరించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. పదేళ్లలో భారాస చేయలేని పనిని తమ ప్రభుత్వం ఏడు నెలల్లోనే చేసి చూపించిందన్నారు.