తన అసలు రాజకీయ రంగు బయటపెట్టాడు
టిడిపిని ముందు పెట్టి బిజెపి రాజకీయం మొదలు
బిజెపి డైరెక్షన్లోనే పని చేస్తున్న బాబు, పవన్
టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు జగ్గారెడ్డి హాట్ హాట్ వ్యాఖ్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : విభజన పేరుతో ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణలోకి ఎంటర్ అయ్యాడనీ, తెలంగాణలో టిడిపిని ముందు పెట్టి బిజెపి రాజకీయం మొదలుపెట్టిందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి హాట్ వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు సోమవారం గాంధీభవన్లో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు తన అసలు రాజకీయ రంగు బయట పెట్టాడనీ, రెండు రాష్ట్రాలు రెండు కండ్లు అన్నాడు..హైటెక్ సిటీ.. సాఫ్ట్వేర్ అభివృద్ధి నాదే అంటున్నాడనీ, వాస్తవానికి హైటెక్ సిటీకి పునాది వేసింది కాంగ్రెస్ సిఎం నేదురుమల్లి జనార్ధన్రెడ్డి అని, ఐటి అభివృద్ధిని చంద్రబాబు కొనసాగించారనీ, వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్రెడ్డి, కేసీఆర్ కొనసాగించారన్నారు. బిజెపి డైరెక్షన్లోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని, ఏపిలో వేసిన పొలిటికల్ గేమ్ను తెలంగాణలోనూ మొదలుపెట్టాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి బిజెపి ఎత్తుగడలో చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నారనీ, బిజెపి ఎన్ని వ్యూహాలు చేసినా కాంగ్రెస్ కార్యకర్తల శక్తిని చంపలేరన్నారు. ఈడి, సిబిఐ, ఐటి వల్లనే బిజెపి పార్టీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వొచ్చిందనీ, లేకుంటే రాహుల్గాంధీ ప్రధానమంత్రి అయ్యేవాడన్నారు. సంగారెడ్డి రాజ్యానికి మళ్లీ మా ప్రజలు గెలిపించుకుని రాజుని చేస్తారనీ, నామినేట్ పదవులకు యోధుడు పోటీ పడడన్నారు. ఐటికి పునాదులు వేసింది కాంగ్రెస్…కొనసాగించింది చంద్రబాబు అని అన్నారు. ఎవరి రాజకీయ పార్టీల ఎత్తుగడ వారికి ఉంటుందనీ, కొన్ని సందర్భాల్లో పార్టీలు బలహీన పడతాయనీ, కొన్ని సందర్భాల్లో బలపడతాయన్నారు. రాజకీయాల్లో ఇది సహజమన్నారు. బిజెపికి నార్త్లో బలం తగ్గడంతో సౌత్పై దృష్టి పెట్టిందన్నారు. దీనిలో భాగంగానే ఏపి, తెలంగాణ, కర్ణాటక మీద ఫోకస్ పెట్టిందన్నారు. ఈ మూడు రాష్ట్రా ఫలితాలే బిజెపికి అధికారం తెచ్చాయన్నారు. లేదంటే ఇండియా కూటమి అధికారంలోకి వొచ్చేదన్నారు.
కాంగ్రెస్ నాయకత్వం, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం వొచ్చిందనీ, ఏపిలో మాజీ సిఎం జగన్మోహన్రెడ్డిని బిజెపి ఇండైరెక్ట్గా మెయింటెయిన్ చేసిందనీ, పవన్కల్యాణతో చంద్రబాబును కంట్రోల్లో పెట్టుకుందన్నారు. ఏపిలో నాలుగు స్తంభాల ఆట జరిగిందనీ, గడిచిన ఏడాదిన్నర నుండే టిడిపిని కల్యాణ్ ఎంకరేజ్ చేస్తూ వొచ్చాడనీ, ఏపిలో పట్టులేని బిజెపి మూడు ఎంపీ సీట్లు గెలిచిందన్నారు. నాలుగు స్తంభాల ఆటలో కాంగ్రెస్ బలపడకుండా చేస్తున్నారనీ, చంద్రబాబును జగన్ జైలులో పెట్టకుంటే ఎన్నికలు టైట్గా ఉండేవన్నారు. మూడు పార్టీలకు తోడు… కేసీఆర్ పార్టీ బలంగానే ఉంటదనీ, కూతురు జైలులో బిజెపితో కొట్లాడాలని చూస్తాడా?బిజెపికి తెలంగాణలో నాలుగో స్తంభంగాగా కేసీఆర్ మారుతారా? అనే అనుమానం ఉందన్నారు. చంద్రబాబు గతంలో హైదరాబాద్ వొచ్చి పోయేది కూడా తెలియకపోయేదనీ, కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సమర్ధించారంటనే ఇవన్నీ బిజెపి లైన్లోనే నడుస్తున్నట్టు స్పష్టంగా అగుపిస్తుందన్నారు. రాజు యుద్ధం చేసి గెలుస్తాడనీ, బండి సంజయ్ ఈడి, సిబిఐ కేసులు ఉన్నోళ్లను బిజెపిలోకి తీసుకోమని అంటున్నారనీ…ఇప్పటికే ఈడి, సిబిఐ కేసులు ఉన్నోళ్లను చేర్చుకున్నారన్నారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బిజెపికి తలొగ్గడం లేదనీ బెయిల్ ఇవ్వడం లేదన్నారు. ఇంకో నాలుగు నెలలైనా కేజ్రీవాల్కి కోర్టు బెయిల్ ఇవ్వాల్సిందేనని అన్నారు. ఈడి, సిబిఐ, ఐటి సంస్థలతోనే బిజెపి నిలబడుతుందని జగ్గారెడ్డి అన్నారు.